ఏపీలో 'ఎస్ఐఆర్'.. అలర్ట్ గా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు సజ్జల ఆదేశం

  • జూన్ 15 నుంచి ఏపీలో ఎస్ఐఆర్ జరుగుతుందన్న సజ్జల
  • అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచన
  • సమర్థవంతంగా పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం నేపథ్యంలో వైసీపీ తన క్యాడర్‌ను ఈ కార్యక్రమం కోసం సిద్ధం చేస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ పరిశీలకులతో నిర్వహించిన కీలక సమావేశంలో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ జూన్ 15న ప్రారంభమై సెప్టెంబర్ వరకు అత్యంత కీలకమైన దశల వారీగా సాగనుందని ఆయన వివరించారు.


సజ్జల వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, జూన్ 15 నుంచి జూలై 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. అనంతరం జూలై 21న ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఓటర్ల నుంచి వచ్చే అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కార ప్రక్రియను పూర్తి చేసి, చివరగా సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగే ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగినది కావడంతో, పార్టీ తరఫున నియమించిన కమిటీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.


ఈ ఓటర్ల సవరణ క్రతువులో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని సజ్జల స్పష్టం చేశారు. బూత్ లెవల్ ఆఫీసర్లతో (BLOs) నిరంతరం సమన్వయం చేసుకుంటూ, వైసీపీ సానుభూతిపరుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితా నుండి తొలగించబడకుండా డ్రాఫ్ట్ స్థాయిలోనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం బీఎల్ఏలకు త్వరలోనే ప్రత్యేక ఓరియెంటేషన్, శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఇది 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' కావడం వల్ల ఒకసారి ఓటు తొలగిస్తే మళ్లీ చేర్చడం చాలా కష్టమని, ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తేనే ఓటు భద్రంగా ఉంటుందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ఓటర్లకు వివరించి వారిని చైతన్యపరచాలన్నారు. ఈ సుదీర్ఘ ప్రక్రియలో సమర్థవంతంగా పనిచేసి, బాధ్యతలను నెరవేర్చే బీఎల్ఏలకు రాబోయే రోజుల్లో పార్టీలో తగిన గుర్తింపు, పురస్కారాలు తప్పకుండా ఉంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు.


Sajjala Ramakrishna Reddy
YSRCP
Andhra Pradesh
Voter List
Special Intensive Revision
Booth Level Agents
Voter Enrollment
Election Commission
Voter Awareness
Political News

More Telugu News